AI University in Telangana
AI University in Telangana | ఏఐ యూనివర్సిటీతో పెరగనున్న తెలంగాణా ప్రతిష్ట
డీటీసీసీ నూతన కార్యలయాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్బాబు
పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర యువతను కృతిమ మేథ( Artificial Intelligence AI )లో నిపుణులుగా తీర్ది దిద్దాలనే సంకల్పంతో సిటీలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం హైటెక్ సిటీలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సేవలు అందిస్తున్న డిపాజిటరీ ట్రస్ట్, క్లియరింగ్ కార్పోరేషన్
(Depository Trust & Clearing Corporation DTCC) నూతన కార్యాలయాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. `ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామిక వేత్తలను ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ప్రోత్సహాలు ఉంటాయి. 200 ఎకరాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏఐ సిటీని నిర్మించబోతున్నాం. అక్కడే ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ యూనివర్సిటీ నిర్వహణలో సంబంధిత పరిశ్రమలు, నిపుణులను భాగస్వామ్యం చేస్తాం. రాబోయే రోజుల్లో ఏఐ అంటే తెలంగాణ హైదరాబాద్ గుర్తు కు వచ్చేలా దాన్ని తీర్చి దిద్దుతాం' అని పేర్కొన్నారు. “రోజు రోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అదే సమయంలో కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. యువత కొత్తగా ఆలోచించి వీటికి పరిష్కారాలను, నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి. ఆ దిశగా కృషి చేసే వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటాం” అని హామీ ఇచ్చారు. “హైదరాబాద్ అనగానే అందరికీ కేవలం సాఫ్ట్ వేర్ కంపెనీలే గుర్తుకొస్తాయి. కానీ ఇక్కడ అన్ని రంగాలకు చెందిన కంపెనీలు కూడా న్నాయి. 100 నుంచి 120 కంపెనీలు ఇక్కడి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సేవలందిస్తున్నాయి. అన్ని రకాల పరిశ్రమలను స్థాపించేందుకు అనువైన వాతావరణం తెలంగాణలో ఉంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. కంపెనీలకు కావాల్సిన నైపుణ్యాలున్న మానవ వనరులను తాము అందిస్తాం. నిశ్చింతంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టండి” అని కోరారు. అయితే డీటీసీసీ భారత్ లో తన రెండో కార్యాలయాన్ని హైదరాబాద్ లో ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఇక్కడ సుమారు 500 మందికి కొత్తగా ఉపాధి లభించనుందన్నారు. రాబోయే రోజుల్లో 2000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వీటిలో అధిక శాతం తెలంగాణ యువతకు ఇవ్వాలని కోరగా అందుకు యాజమాన్యం అంగీకరించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీటీసీసీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రెనీ లారోకే మోరీస్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లిన్ బిషప్ తదితరులు పాల్గొన్నారు.
* * *
Leave A Comment