అరుణిమ సిన్హాకు డాక్టరేట్
భారత మాజీ వాలీబాల్ క్రీడాకారిణి, పర్వతారోహకురాలు అరుణిమ సిన్హాకు యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన స్ట్రాత్ క్లైడ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను అందజేసింది. 2011లో దుండగులు రైలు నుంచి తోసివేయడంతో కాలు పోగొట్టుకున్న అరుణిమ 2013, మే-21న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. దీంతో ప్రపంచంలోనే ఆ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళా దివ్యాంగురాలిగా ఆమె రికార్డులకెక్కారు. 2015లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
జాతీయ జర్నలిజం ప్రతిభా పురస్కారాలు
2018 సంవత్సరానికి గాను జాతీయ జర్నలిజం ప్రతిభా పురస్కారాలను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(PCI) 2018, నవంబర్ -5న ప్రకటించింది.
పాత్రికేయ రంగంలో విశేష సేవలు అందించినందుకు హిందు గ్రూపు ఛైర్మన్ N.రామ్ కు ప్రతిష్ఠాత్మక రాజా రామ్మోహన్ రాయ్ పురస్కారాన్ని; గ్రామీణ పాత్రికేయ విభాగంలో రుబీ సర్కార్(దేశ్ బంధు పత్రిక), పరశురామ్ జోష్టే (డైలీ పుధారీ పత్రిక) లకు ‘ఎక్స్ లెన్స్ ఇన్ జర్నలిజం‘ అవార్డులను ప్రకటించింది. అభివృద్ధి పాత్రికేయ విభాగంలో VS.రాజేష్ (కేరళ కౌముది), ఫోటో జర్నలిజంలో సుభాష్ పాల్ (రాష్ట్రీయ సహారా), మిహిర్ సింగ్(పంజాబ్ కేసరి)లకు అవార్డులు లభించాయి.
వ్యంగ్య చిత్రాల విభాగంలో P.నరసింహా(నవ తెలంగాణ) అవార్డుకు ఎంపికయ్యారు. పశ్చిమ బంగలో పంచాయతీ ఎన్నికల హింస నేపథ్యంలో ఆయన గీసిన కార్టూన్ కు ఈ పురస్కారం దక్కింది.
జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నవంబరు-16న దిల్లీలో జరిగే కార్యక్రమంలో విజేతలకు పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
ఆనంద్ కు గ్లోబల్ అవార్డు
విద్యారంగంలో చేసిన కృషికి గాను ప్రముఖ గణితవేత్త, సూపర్-30 కార్యక్రమ నిర్వాహకుడు ఆనంద్ కుమార్ కు గ్లోబల్ ఎడ్యుకేషన్ అవార్డు లభించింది. 2002లో బిహార్ లోని పాట్నాలో రామానుజం స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ను స్థాపించి నిరుపేద పిల్లలను 30 మందిని ఎంపిక చేసి ఉచితంగా IIT కోచింగ్ అందిస్తున్నాడు.
ఫ్రెంచ్ లీజియన్ ఆఫ్ హానర్ అవార్డు
రెండో ప్రపంచ యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి శత్రువుల దాడుల నుంచి 14 మంది తోటి సైనికులను కాపాడిన 100 ఏళ్ల రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ విలియమ్ పొల్లార్డ్ ను ఫ్రాన్స్ ప్రభుత్వం ‘లీజియన్ ఆఫ్ హానర్‘ పురస్కారంతో సత్కరించింది.
ఇందిరాగాంధీ శాంతి పురస్కారం
2018 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక ‘ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి పురస్కారం‘ ను దిల్లీకి చెందిన ‘పర్యావరణ మేధో సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్(CSE)’ కి ప్రకటించారు. పర్యావరణ విద్య, పరిరక్షణలో చేసిన కృషికి గుర్తింపుగా PSE కి ఈ పురస్కారాన్ని ప్రకటించారు.
2017 సంవత్సరానికిగాను ఇదే పురస్కారాన్ని 2018, నవంబరు-19న దిల్లీలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు ప్రదానం చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, UPA ఛైర్ పర్సన్ సోనియాగాంధీ సమక్షంలో పురస్కారాన్ని విశ్రాంత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ TS ఠాకూర్ ప్రదానం చేశారు.
మాజీ ప్రధానమంత్రి, దివంగత ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబరు-19న ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
సర్ హెన్రీ కాటన్ పురస్కారం
భారతీయ గోల్ఫర్ శుభాంకర్ శర్మ సర్ హెన్రీ కాటన్ రూకి ఆఫ్ ది ఇయర్ అవార్డుకి ఎంపికయ్యాడు. యురోపియన్ టూర్ లో ఈ అవార్డు గెలిచిన తొలి భారత గోల్ఫర్ గా రికార్డులకెక్కాడు. ఈ అవార్డును ఆసియన్ టూర్ లో అర్జున్ అత్వాల్(1995), శివ కపూర్(2005), మునియప్పన్(2009) గెలుపొందారు.