☛ ఏపీ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటు కోసం తీసుకొచ్చిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జూలై 31న ఆమోదించారు. ఆ బిల్లులను అన్ని కోణాల్లో పరిశీలించి, న్యాయ నిపుణులతో చర్చించి, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న అనంతరం గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీంతో విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని… అమరావతిలో శాసన రాజధాని… కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించటంతో.. అవి చట్టాలుగా మారాయి. ఆ మేరకు రాష్ట్ర న్యాయశాఖ జూలై 31నే వేర్వేరుగా గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది.
☛ ఏపీలో ప్లాస్మా దాతకు రూ. 5 వేలు
ప్లాస్మా థెరపీతో సానుకూల ఫలితాలు వస్తుంటే, దాన్ని ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్లాస్మా ఇచ్చే వారికి రూ.5 వేలు ఇవ్వాలన్నారు. కోవిడ్ – 19 నివారణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ జూలై 31న తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా అధికారులకు ఆయన కీలక ఆదేశాలిచ్చారు. కరోనా సోకిన వారికి మరింత మెరుగైన చికిత్స, సేవలపై దృష్టి పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కోవిడ్ చికిత్స కోసం ఎంపిక చేసిన 138 ఆస్పత్రుల్లో సూక్ష్మస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆయన కోరారు. చికిత్స, మందులు, ఆహారం, పారిశుద్ధ్యం.. ఈ నాలుగు అంశాలపై గట్టి పర్యవేక్షణ చేయాలన్నారు. అలాగే, ఆస్పత్రుల్లో భర్తీ అయిన బెడ్లు, ఖాళీ అయిన బెడ్ల వివరాలను ఆస్పత్రి వెలుపల బోర్డు ద్వారా తెలియజేయాలని.. ఆ వివరాలను డిజిటల్ పద్ధతుల్లో అన్ని కోవిడ్ ఆస్పత్రులకూ అందుబాటులో ఉంచాలన్నారు.
☛ జాతీయ క్రీడా అవార్డుల ఎంపిక కమిటీలో సెహ్వాగ్
జాతీయ క్రీడా అవార్డుల విజేతలను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీని జూలై 31న కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నియమించింది. 12 మంది సభ్యుల ఈ కమిటీలో భారత మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్తో పాటు భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్లు చోటు దక్కించుకున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ముకుందకమ్ శర్మ ఈ ప్యానల్కు చైర్మన్గా వ్యవహరిస్తారు.
☛ యూపీలో డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే రూ.10 వేల ఫైన్
ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రోడ్డు భద్రతా నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే వాహనదారులకు రూ.10 వేలు జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు జూలై 31న రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం గత ఏడాదిగా మద్యం మత్తులో డ్రైవ్ చేసినా, అంబులెన్స్లకు దారి ఇవ్వకపోయినా చోదకుల నుంచి 10 వేల రూపాయల వరకు జరిమానా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు మొబైల్ మాట్లాడటం కూడా అందులో చేరింది.
☛ మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం మరో 3 నెలలు పొడిగింపు
పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నిర్బంధాన్ని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. గత ఏడాది ఆగస్టులో కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన సందర్భంగా ప్రజా భద్రత చట్టం కింద నిర్బంధంలోకి తీసుకున్న వారిలో మెహబూబా కూడా ఒకరు. ఆగస్టు 5వ తేదీ నాటికి ఆమె నిర్బంధకాలం ఏడాది పూర్తవుతుంది. దీంతో, మెహబూబా గృహ నిర్బంధాన్ని మరో 3 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె తన అధికార నివాసం శ్రీనగర్లోని ఫెయిర్వ్యూ బంగళాలో ఉన్నారు.
☛ చైనా సొంత నావిగేషన్ వ్యవస్థ ‘బీడో’ ప్రారంభం
చైనా తన సొంత నావిగేషన్ వ్యవస్థ ‘బీడో’ను విజయవంతంగా అభివృద్ధి చేసింది. ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ బీజింగ్లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్లో ఈ వ్యవస్థను అధికారికంగా ప్రారంభించారు. జూన్ 23న ప్రయోగించిన 35వ మరియు చిట్టచివరి జియో స్టేషనరి ఉపగ్రహం విజయవంతమైంది. దీంతో ప్రాజెక్టు పూర్తి ఆపరేషన్కు కావాల్సిన 35 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి. దీంతో సొంత నావిగేషన్ వ్యవస్థ కలిగిన అమెరికా, రష్యా, యూరప్ సరసన చైనా నిలిచింది.
☛ కలర్ టీవీల దిగుమతిపై పరిమితులు
కలర్ టెలివిజన్ సెట్ల దిగుమతి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇప్పటి వరకు అన్ని సైజుల కలర్ టీవీ సెట్ల దిగుమతి ‘ఉచిత‘ కేటగిరీ కింద ఉండేది. దీనిని ‘పరిమితం‘ కేటగిరీకి సవరించింది. ఈ మేరకు లైసెన్స్ మంజూరు చేసే విధానాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) విడిగా జారీ చేస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ జూలై 31 తెలిపింది. దేశీ తయారీని ప్రోత్సహించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో 781 మిలియన్ డాలర్ల విలువైన కలర్ టీవీలు విదేశాల నుంచి భారత్ కు దిగుమతి కాగా… అందులో అధికంగా చైనా (428 మిలియన్ డాలర్లు), వియత్నాం(292 మిలియన్ డాలర్లు) నుంచే వచ్చాయి.
☛ ఫ్లిప్ కార్ట్ సమర్థ్ ద్వారా 6 లక్షల చేతివృత్తిదారులకు ప్రోత్సాహం
చేతి వృత్తిదారులను ప్రోత్సహించేందుకు 2019లో సమర్థ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఫ్లిప్ కార్ట్… దీని ద్వారా ఈ ఏడాది 6 లక్షల మందికి సహాయం అందించనున్నట్లు ప్రకటించింది. వారు తయారు చేసిన ఉత్పత్తులను ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్ముకునేందుకు వేదిక కల్పిస్తామని సంస్థ వెల్లడించింది. ఈ మేరకు 5 స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది.
☛ బంగ్లాదేశ్ లో రిలియన్స్, జెరా పవర్ ప్లాంట్
జపాన్ కు చెందిన జెరా సంస్థతో కలిసి రిలయన్స్ పవర్ లిమిటెడ్.. బంగ్లాదేశ్ లో పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. 642 మిలియన్ డాలర్ల వ్యయంతో 745 మెగావాట్ల గ్యాస్ పవర్ ఉత్పత్తి కేంద్రాన్ని బంగ్లా రాజధాని ఢాకాకు 40 కిలోమీటర్ల దూరంలోని మేఘనాఘాట్ లో నెలకొల్పనుంది. దీని ద్వారా ఆ దేశంలో 8.50 లక్షల గృహాలకు విద్యుత్ అందనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
☛ ఆగస్టు 1 – ముస్లిం మహిళా హక్కుల దినోత్సవం
భారత్ లో ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టం అమల్లోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని.. ఆగస్టు 1ని ముస్లిం మహిళల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు 2019 జూలై 25న 79 శాతం అనుకూల ఓట్లతో లోక్ సభ ఆమోదం పొందింది. అదే నెల 30న 54 శాతం అనుకూల ఓట్లతో రాజ్యసభలోను పాసైంది. 2019 ఆగస్టు 1న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్… బిల్లుపై సంతకం చేయటంతో.. ట్రిపుల్ తలాక్ చట్టంగా మారింది. 2020 ఆగస్టు 1తో ఈ చట్టం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తయింది.