☛ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు జాతీయ పర్యాటక అవార్డు
దక్షిణ మధ్య రైల్వేలోని కీలక రైల్వే స్టేషన్ అయిన సికింద్రాబాద్.. మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకుంది. ప్రయాణికుల సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, పర్యాటకులను ఆకట్టుకోవడంలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచి… జాతీయ పర్యాటక అవార్డు గెలుచుకుంది. ఈ మేరకు అక్టోబర్ 2న జాతీయ పర్యాటక సంస్థ ప్రకటించింది.
-
నిత్యం 210 రైళ్లు, లక్షా 80 వేల మందికిపైగా ప్రయాణికుల రాకపోకలతో సికింద్రబాద్ రైల్వేస్టేషన్ దక్షిణ మధ్య రైల్వోలే అతిపెద్దది.
-
ఈ ఏడాది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ … స్వచ్ఛ రైల్వే స్టేషన్ పురస్కారాన్ని సైతం గెలుచుకుంది.
-
ప్రతిష్టాత్మక ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ సొసైటీ నుంచి పర్యావరణ పరిరక్షణ, ఇంధన వనరుల సద్వినియోగంలో ప్లాటినమ్ సర్టిఫికెట్ దక్కించుకుంది.
☛ పారా ఏషియాడ్ లో భారత పతాకధారిగా తంగవేలు
ఇండోనేషియాలోని జకార్తాలో అక్టోబర్ 6 నుంచి 13 వరకు జరిగే పారా ఆసియా క్రీడల్లో భారత పతాకధారిగా రియో పారాలింపిక్స్ చాంపియన్ తంగవేలు మరియప్పన్ వ్యవహరించనున్నాడు. ఈ పోటీల్లో అథ్లెట్లు, సహాయ సిబ్బంది సహా మొత్తం 302 మందితో కూడిన భారత బృందం పాల్గొంటుంది.
-
2016లో జరిగిన రియో పారాలింపిక్స్ పోటీల్లో హై జంప్ ఈవెంట్లో తంగవేలు మరియప్పన్ స్వర్ణం గెలుచుకున్నాడు. తద్వారా ఈ పోటీల్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా గుర్తింపు సాధించాడు.
☛ గిర్ అభయారణ్యంలో మరో రెండు సింహాలు మృతి
గుజరాత్ లోని గిర్ అభయారణ్యంలో సింహాల మరణాలు అటవీశాఖ అధికారులు, జంతు ప్రేమికులను ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా అక్టోబర్ 2న ఈ అభయారణ్యంలో మరో రెండు సింహాలు మృతి చెందాయి.
-
దీంతో 2018 సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఇక్కడ మృతి చెందిన సింహాల సంఖ్య 23కు చేరింది.
-
కొట్లాటలు, ఇన్ఫెక్షన్ల కారణంగా ఇవి చనిపోయాయి.
-
అభయారణ్యంలోని దల్జానియా రేంజ్ లోనే ఈ మరణాలన్నీ సంభవించాయి.
☛ ఘనంగా గాంధీ జయంతి.. బాపూకి “కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్“
ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న మహాత్మా గాంధీ 149వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. 2019 అక్టోబర్ 2న బాపూజీ 150వ జయంతి నేపథ్యంలో.. ఏడాది పాటు ఉత్సవాలు జరపాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. వేడుకలను ఘనంగా ప్రారంభించింది.
-
శాంతి, సహనం, అహింసను బోధించిన మహాత్ముని స్ఫూర్తిదాయక జీవితానికి గుర్తింపుగా అమెరికా కాంగ్రెస్.. గాంధీకి అత్యున్నత పౌర పురస్కారం “కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్” ఇవ్వనుంది. ఇందుకోసం అమెరికా కాంగ్రెస్ లో తీర్మానం ప్రవేశపెట్టింది.
-
గాంధీ జయంతిని పురస్కరించుకొని బ్రిటన్ దౌత్యకార్యాలయంలో ఏర్పాటు చేసిన గాంధీ బోధనలను గుర్తుచేసుకుంటు బాపు@150 చిత్రాన్ని ప్రదర్శించారు.
-
నెదర్లాండ్స్ రాజధాని ఆమ్ స్టర్ డామ్, జపాన్, రష్యాల లో భారత పోస్టల్ శాఖ రూపొందించిన గాంధీ స్మారక స్టాంపును విడుదల చేశారు.
-
గాంధీ శతజయంతి.. అంటే.. 1969లో ఆయన స్మారకార్థం రూ.100 నోటుపై తొలిసారి గాంధీ బొమ్మను ముద్రించింది.
-
ఆ తర్వాత 1996 వరకు ఆయన చిత్రం నోట్లపై ముద్రించలేదు
-
1996లో తొలిసారిగా నవ్వుతున్న గాంధీ చిత్రంతో కొత్త సీరీస్ నోట్లను ఆర్బీఐ ముద్రించింది.
-
1949లో రూపాయి నోటుపై ఆశోక స్తంభాన్ని చేర్చారు.
☛ ఆంధ్రప్రదేశ్ లో “యువనేస్తం” ప్రారంభం
అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “యువనేస్తం” పథకాన్ని ప్రారంభించింది. రాజధాని అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. నిరుద్యోగులకు నెలకు రూ. వెయ్యి భృతి చెల్లించేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని ప్రారంభించారు. అలాగే యువజన విధానం 2018ని( AP Youth Policy 2018) ఆవిష్కరించారు.
యువనేస్తం వివరాలు ఇవి:
-
యువనేస్తం పథకం కింద ఇప్పటి వరకు 2.10 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు.
-
అర్హులందరికీ నెలకు రూ. వెయ్యి నిరుద్యోగి భృతిని చెల్లిస్తారు. నగదు మొత్తాన్ని వారి ఖాతాల్లోనే జమ చేస్తారు.
☛ తిరుపతిలో ప్లాస్టిక్ పై నిషేధం
ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుపతిలో ప్లాస్టిక్ వస్తువుల వాడకంపై నిషేధం విధించారు. ఈ మేరకు అక్టోబర్ 2న ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, కప్పులు సహా పలు రకాల ప్లాస్టిక్ ఉత్పత్తుల ఉత్పత్తి, అమ్మకం, వినియోగాన్ని నిషేధించారు. నిబంధన అతిక్రమించిన వారిపై భారీ జరిమానా ఉంటుందని ప్రకటించారు. తిరుపతి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
పూణెలో ప్రపంచంలో అతిపెద్ద డోమ్
ప్రపంచంలోనే అతిపెద్ద డోమ్ ను( గుమ్మటం) పూణె మహారాష్ట్ర ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని(MIT) వరల్డ్ పీస్ యూనివర్సిటీ క్యాంపస్ లో ఆవిష్కరించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు డోమ్ ను ఆవిష్కరించారు.
-
MIT వరల్డ్ పీస్ లైబ్రరీ, వరల్డ్ పీస్ ప్రేయర్ హాల్ పై ఈ డోమ్ ను నిర్మించారు.
-
దీని వ్యాసార్థం 160 ఫీట్లు.
-
ఇంతకముందు ప్రపంచంలోనే అతిపెద్ద డోమ్ గా ఉన్న వాటికన్ డోమ్ వ్యాసార్థం 139.6 ఫీట్లు.