☛ పార్లమెంటులో 32 బిల్లులకు ఆమోదం
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన 2019 పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 32 బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించింది. జూన్ 17 నుంచి ఆగస్టు 7 వరకు జరిగిన ఈ సమావేశాల్లో లోక్సభ 35 బిల్లులకు ఆమోదం తెలపగా… రాజ్యసభ 32 బిల్లులను ఆమోదించింది.
☛ యూపీలో కొత్తగా గోసంరక్షణ పథకం
ఉత్తరప్రదేశ్లో కొత్తగా గోసంరక్షణ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగస్టు 7న ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం ప్రభుత్వం నడుపుతున్న గోసంరక్షణశాలల్లోని లక్ష గోవులను ఎంపిక చేసిన రైతులకు, ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు అందజేస్తారు. గోవుల పోషణకు ఎంపిక చేసిన వారికి ఒక్కో గోవుకు రోజుకు రూ.30 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ ప్రకారం నెలకు రూ.900 వేతనాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తారు. తొలిదశలో ఈ కొత్త స్కీమ్ కింద రూ.109 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
☛ అంతర్జాతీయక్రికెట్కు హషీమ్ ఆమ్లా రిటైర్మెంట్
దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ హషీమ్ మొహమ్మద్ ఆమ్లా ఆటకు వీడ్కోలు పలికాడు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లనుంచి రిటైర్ అవుతున్నట్లు 36 ఏళ్ల ఆమ్లా ఆగస్టు 8న ప్రకటించాడు. అయితే దేశవాళీ క్రికెట్కు అందుబాటులో ఉంటానని వెల్లడించాడు. టెస్టు క్రికెట్లో పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్న ఆమ్లా వన్డేల్లోనూ తన సత్తా చాటాడు. 2002 అండర్-19 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాకు కెప్టెన్గా వ్యవహరించిన ఆమ్లా కోల్కతాలో భారత్పైనే 2004లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో దక్షిణాఫ్రికా తరఫున ట్రిపుల్ సెంచరీ (311 నాటౌట్) సాధించిన ఏకైక క్రికెటర్గా ఆమ్లా రికార్డు నెలకొల్పాడు.
☛ ఏపీలో మహిళా మిత్ర సేవలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 8న ‘మహిళా మిత్ర’ సేవలను శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్తో కలిసి ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ హాల్లో మహిళా మిత్ర ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు ఎలాంటి సైబర్ సమస్యలున్నా 9121211100కు వాట్సాప్ చేయాలని మంత్రి సుచరిత సూచించారు.
☛ సంఝౌతా ఎక్స్ప్రెస్ సేవలు నిలుపుదల
ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకోవడంతో సంఝౌతా ఎక్స్ప్రెస్ సేవలను నిలిపేస్తున్నట్లు పాకిస్తాన్ రైల్వే మంత్రి రషీద్ ఆగస్టు 8న ప్రకటించారు. 1971లో భారత్–పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధం తర్వాత సిమ్లా ఒప్పందంలో భాగంగా సంరతా ఎక్స్ప్రెస్ రైలు సేవలు 1976 జూలై 22న ప్రారంభమయ్యాయి. పాక్లోని లాహోర్, భారత్లోని ఢిల్లీ మధ్య ఈ రైలు నడుస్తుంది. లాహోర్ నుంచి ప్రతి సోమవారం, గురువారం బయల్దేరుతుంది. ఢిల్లీ నుంచి ప్రతి బుధవారం, ఆదివారం బయల్దేరుతుంది. ఈ రెండు రైళ్లు కూడా అట్టారీ స్టేషన్ వరకు వెళ్తాయి.
☛ హైదరాబాద్లో గోల్డ్మెడల్ ఎలక్ట్రికల్స్ ప్లాంటు
హైదరాబాద్లో పటాన్చెరు సమీపంలో ఎలక్ట్రికల్ గూడ్స తయారీ సంస్థ గోల్డ్మెడల్ ఎలక్ట్రికల్స్ ప్లాంటు ఏర్పాటుచేయనుంది. ఈ ప్రతిపాదిత ప్లాంటుకు వచ్చే మూడేళ్లలో రూ.125 కోట్లు వెచ్చించనున్నట్లు గోల్డ్మెడల్ డెరైక్టర్ కిషన్ జైన్ ఆగస్టు 8న తెలిపారు. ఏటా 12 లక్షల ఫ్యాన్ల తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంటుని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ గూడ్స పరిశ్రమలో గోల్డ్మెడల్కు 15-18 శాతం వాటా ఉంది. గోల్డ్మెడల్ సంస్థకు విజయవాడ, ముంబై, రాజస్థాన్లో ఇప్పటికే ఫ్యాక్టరీలు ఉన్నాయి.
☛ ఐఓసీ దక్షిణ ప్రాంత ఈడీగా అరూప్ సిన్హా
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) దక్షిణ ప్రాంత ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ప్రాంతీయ సేవలు)గా అరూప్ సిన్హా ఆగస్టు 8న బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడు, పుదుచ్ఛేరి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలకు సంబంధించిన మానవ వనరులు, ఆర్థిక, ఉత్పత్తి రవాణా, కాంట్రాక్టులు, భద్రత, నాణ్యత నియంత్రణ వంటి పలు బాధ్యతలను ఆయన నిర్వర్తించనున్నారు. యూనివర్సిటీ ఆఫ్ లఖ్నవూ నుంచి మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ను అరూప్ పూర్తిచేశారు.
☛ మలబార్ గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్గా అనిల్ కపూర్
ప్రముఖ వజ్రాభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్సకు బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నియమితులయ్యారు. మలబార్ ప్రామిసెస్ పేరిట తర్వలోనే విడుదలకానున్న వాణిజ్య ప్రకటనల్లో అనిల్ దర్శనమివ్వనున్నారని సంస్థ చైర్మన్ అహ్మద్ ఆగస్టు 8న తెలిపారు. కరీనా కపూర్ ఖాన్, తమన్నా, మానుషీ చిల్లర్ వంటి వారు ఇప్పటికే ఈ సంస్థ ప్రచారకర్తలుగా ఉన్నారు.